మెడకు వైరు చుట్టి గ్రేహౌండ్స్ పరిసరాలలో పడేసిన ప్రియుడు.
భీమిలి/మధురవాడ:
వివాహేతర సంబంధం ఓ వివాహిత ప్రాణాల మీదికి తెచ్చింది. క్షణికావేశంలో ప్రియుడే ఆమెను అంతమొందించాలని చూసిన ఘోర ఉదంతం భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. మెడకు ప్లాస్టిక్ కోటెడ్ ఐరన్ వైరు బిగించి,చావుబతుకుల మధ్య ఉన్న మహిళను పోలీసులు, స్థానికులు కాపాడిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…
మధురవాడ, వైఎస్సార్ కాలనీకి చెందిన ఆశ (27) అనే మహిళకు ఇదివరకే వివాహమై ఒక సంతానం ఉంది.భర్తతో వచ్చిన విభేదాల కారణంగా ఆమె దూరంగా ఉంటోంది.ఈ క్రమంలో మధురవాడ స్వతంత్రనగర్ ప్రాంతానికి చెందిన కొయ్య కార్తీక్(29) అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. కార్తీక్కు కూడా ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు.అయినప్పటికీ..
గత ఐదేళ్లుగా వీరిద్దరూ సహజీవనం సాగిస్తున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య తీవ్ర మనస్పర్ధలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2గంటల సమయంలో ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది.దీంతో ఆగ్రహానికి గురైన కార్తీక్,ఆశ ను హతమార్చాలనే ఉద్దేశంతో ఆమె మెడకు ప్లాస్టిక్ కోటెడ్ ఐరన్ వైరు గట్టిగా చుట్టి ఊపిరాడకుండా చేశాడు.ఆమె స్పృహ కోల్పోవడంతో చనిపోయిందని భావించిన కార్తీక్,గ్రేహౌండ్స్ సమీపంలోని భావికొండ ప్రాంతంలో పడేశాడు.అనంతరం అర్ధరాత్రి సమయంలోనే తన బావకు ఫోన్ చేసి,నేను ఆశను చంపేశాను అంటూ ఒక వాయిస్ మెసేజ్ పంపి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కార్తీక్ బావ వెంటనే భీమిలి పోలీసులను ఆశ్రయించి,సదరు వాయిస్ మెసేజ్ వివరాలను సీఐ కు అందజేశారు. దీంతో భీమిలి సీఐ తిరుమలరావు ఆధ్వర్యంలో పోలీసులు రాత్రంతా భావికొండ, గ్రేహౌండ్స్ అటవీ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి సమయంలో దట్టమైన చీకటి కారణంగా ఆమె ఆచూకీ లభించలేదు. బుధవారం తెల్లవారుజామున జీవీఎంసీ 4వ వార్డు పరిధిలోని కాపుల ఉప్పాడ ఊడా లేఅవుట్, గ్రేహౌండ్స్ పరిసర ప్రాంతంలో ఆశ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు,అటుగా వెళ్తున్నవారు వెంటనే 108 అంబులెన్స్కు,పోలీసులకు సమాచారం అందించారు. మెడకు వైరు గట్టిగా చుట్టుకుని కోన ఊపిరితో ఉన్న బాధితురాలిని పోలీసులు తక్షణమే చికిత్స నిమిత్తం గీతం హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతోంది.ఈఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడు కొయ్య కార్తీక్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. భีమిలి సీఐ తిరుమలరావు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్యాయత్నం జరిగిందా లేక మరేదైనా ఆర్థిక పరమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.







